కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్కి గురిచేసింది. దుండగులు పర్యాటకులపై దాడికి తెగబడ్డారు. వారి లక్ష్యం స్పష్టంగా హిందువులే అన్నట్టు, పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ కొందరు నేతలు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు: తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో మైనారిటీలు భయంతో జీవిస్తున్నారని.. వారు బలహీనులుగా భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీకి వలనే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. వాద్రా వ్యాఖ్యల నుంచి స్పష్టంగా ప్రభుత్వం మైనారిటీలను అసౌకర్యంలో ఉంచుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవైపు దేశమంతా విషాదంలో ఉంటే, మరొకవైపు ఈ ఘోర ఘటనను రాజకీయ కోణంలో చూడడం బాధాకరమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. “హిందుత్వ” పేరుతో బీజేపీ పాలన ముస్లింలను ఒంటరిచేస్తోందన్న వాద్రా వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు తావిస్తూనే.. ఈ సమయానికి సరిగ్గా సరిపోవని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు వాద్రా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్విట్టర్లో స్పందిస్తూ, ‘‘సిగ్గు లేకుండా ఉగ్రదాడికి కవర్ ఇస్తున్నారు. వాద్రా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన సమయంలో వారిని సమర్థించుకుంటున్నారు. పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి భారతదేశాన్ని బాధ్యత వహించాల్సిందిగా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించారు.
దేశంలో వాడి వేడిగా నడుస్తున్న రాజకీయాల మధ్య, ఇలాంటి విషాద ఘటనలపై నాయకులు బాధను వ్యక్తపరచాల్సిందే తప్ప, మతాలను ప్రస్తావిస్తూ చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కొందరు అంటున్నారు. ఈ సమయంలో నాయకులు సమగ్ర దృష్టితో మాట్లాడాలి.. ప్రజల భద్రత, ఐక్యతకు అండగా నిలవాలి.. అదే ప్రజలు ఆశించే నాయకత్వ లక్షణం అంటున్నారు రాజకీయ నిపుణులు.