పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈక్రమంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీరీ లోయలో స్లీపర్సెల్స్ యాక్టివేట్ అయినట్లు తెలిపాయి. పెద్దఎత్తున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందిందని అలర్ట్ చేశాయి. దీంతో స్థానికులతో పాటు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి.
మరోవైపు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, ప్రత్యేక బృందాలను మోహరించాయి. భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ఈ ప్రదేశాలను తెరుస్తామని తెలిపింది.