నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. దీంతో పాటే ఇప్పుడు ఎందుకీ గొడవలు అని కూడా ఉంది. శాంతి.. శాంతి.. శాంతి..!’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆయన పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల ‘#సింగిల్’ మూవీ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించే ఆయన ఈ పోస్టు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న ‘#సింగిల్’ మూవీ ట్రైలరలో కొన్ని డైలాగ్స్ వివాదానికి దారి తీశాయి. ఈ ట్రైలర్లో శ్రీ విష్ణు ‘శివయ్యా..’ అంటూ డైలాగ్ చెప్పడం.. చివర్లో ‘మంచు కురిసిపోతుందని’ అంటూ మరో డైలాగ్ చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో కూడా ‘శివయ్యా’ అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ను వెటకారం చేసేలా చెప్పడంపై విష్ణు హర్ట్ అయ్యాడట. దీంతో మూవీ యూనిట్ క్షమాపణలు కూడా చెప్పింది.
‘‘ఇటీవల విడుదలైన మా మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. అయితే ట్రైలర్లోని కొన్ని డైలాగ్లకు ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయిందని తెలిసింది. మేం ఉద్దేశపూర్వంగా అలా చేయలేదు. కానీ, అది తప్పుగా అర్థమైంది. వెంటనే మేం సంబంధిత సీన్స్ను తొలగించాం. సినిమాలోనూ అవి ఉండవు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారీ. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీ వారమంతా ఓ కుటుంబంలా ఉంటాం. ఒకరిని ఒకరం బాధ పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చింది. ఈ వివాద నేపథ్యంలోనే బన్నీ వాసు ఇలాంటి పోస్టు పెట్టాడని చర్చించుకుంటున్నారు.