ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తమ అద్భుత ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్ 38 పరుగుల తేడాతో గెలిచి, తమ ప్లేఆఫ్ ఆశలను బలోపేతం చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు దూకుడుగా ఆరంభించింది.
ఓపెనర్లు శుభ్మన్ గిల్ (76) మరియు సాయి సుదర్శన్ (48) చక్కటి భాగస్వామ్యం నెలకొల్పగా, తర్వాత జోస్ బట్లర్ (64) భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కట్ చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి ప్రత్యేకంగా మెరిశాడు.
అనంతరం SRH జట్టు 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74) ఒంటరిగా పోరాడినా, ఇతర బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో హైదరాబాద్ జట్టు గెలుపు దూరంగా నిలిచింది. క్లాసెన్ (21), నితీష్ రెడ్డి (20) కొంత సహకరించినా, SRH చివరకు 184 పరుగులకే పరిమితమైంది.
గుజరాత్ బౌలర్లు టైట్ లైన్స్తో సన్ రైజర్స్ కు రన్చేసే అవకాశాలను ఇవ్వలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సిరాజ్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కోట్జీ చెరో వికెట్ తీసి జట్టు విజయానికి కారణమయ్యారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించగా, హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ రేసులో ఒత్తిడిని ఎదుర్కొంటోంది.