భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్(IPL 2025) ఈ నెల 17న తిరిగి ప్రారంభం కానుంది. ఈమేరకు బీసీసీఐ రీషెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు వేదికల్లో మే 17 నుంచి 27 వరకు మిగిలిన లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మే 29న క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ జరగుతోంది.
మిగిలిన లీగ్ మ్యాచ్ల కోసం జైపూర్, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలను ఖరారు చేసింది. అయితే ప్లేఆఫ్లను నిర్వహించే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. తాజా నివేదికల ప్రకారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కోల్కతా వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ను ఇక్కడికి మార్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు ముంబై నిర్వహించే అవకాశం ఉంది.