కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి(Veeraiah Chowdary) కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పరామర్శించారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన లోకేశ్.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన వీరయ్య చౌదరి దారుణహత్య బాధాకరమని వాపోయారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయకుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.