ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ కు సమయం దగ్గరపడింది. జూన్ 11 నుంచి 15 వరకు ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు ఆఖరి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా ప్రకటన ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గత సీజన్లతో పోలిస్తే రెట్టింపు ప్రైజ్ మనీని ఇస్తున్నారు.
ఈ సారి మొత్తం 5.76 మిలియన్ డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీ ప్రకారం రూ.49.27 కోట్లు ప్రైజ్ మనీ. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.30.78 కోట్లు లభించనున్నాయి. రన్నరప్ జట్టుకు 2.16 మిలియన్ డాలర్లు అంటే రూ.18.46 కోట్ల పురస్కారం దక్కనుంది.
కేవలం ఫైనల్ ఆడే జట్లు మాత్రమే కాదు, పాయింట్ల పట్టికలో నిలిచిన మిగతా జట్లకూ మెరుగైన ప్రైజ్ మనీనే అందించనుంది ఐసీసీ. మూడో స్థానంలో నిలిచిన భారత్కు రూ.12.31 కోట్లు, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్కు రూ.10.26 కోట్లు అందనున్నాయి. అలాగే ఇంగ్లాండ్కు రూ.8.78 కోట్లు, శ్రీలంకకు రూ.7.18 కోట్లు, బంగ్లాదేశ్కు రూ.6.15 కోట్లు లభించనున్నాయి. వెస్టిండీస్కు రూ.5.13 కోట్లు, పాకిస్తాన్కు రూ.4.10 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది.
గత ఎడిషన్తో పోలిస్తే ఈసారి సుమారు రెండు రెట్లు ఎక్కువగా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. 2021-23 సీజన్లో విజేత అయిన ఆస్ట్రేలియాకు రూ.13.68 కోట్లు, రన్నరప్ టీమిండియాకు రూ.6.84 కోట్లు అందాయి. ఇప్పటిదాకా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ కంటే ఈసారి పోటీ ఇంకా ఉత్కంఠగా మారనుంది.