వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (Vallabhaneni Vamsi) మరో కేసు నమోదైంది. సొంత నియోజకవర్గం గన్నవరంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికను ఆయన పోలీసులకు అందించారు. 2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం రూ.100 కోట్లకు పైగా అక్రమాలపై పాల్పడినట్టు అందులో పేర్కొన్నారు. ఏడీ ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు వంశీ సహా 8 మందిపై కేసు నమోదు చేశారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ వచ్చినా ఆయనపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధిస్తే జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో ప్రస్తుతం వంశీపై మూడు కేసులు ఉన్నాయి. వరుస కేసుల నేపథ్యంలో వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.