హైదరాబాద్లో విధ్వంశం సృష్టించాలన్న ఉగ్ర కుట్రను పోలీసులు సమయానికి అడ్డుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పదార్థాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సిరాజ్ పేలుడు పదార్థాలను విజయనగరంలోనే కొనుగోలు చేసి, హైదరాబాద్లో సమీర్తో కలసి పేలుళ్లకు సిద్ధమయ్యాడు. సమాచారం మేరకు, వీరికి సౌదీ అరేబియా నుంచి ఉన్న ఐసీస్ మాడ్యుల్ ద్వారా ఆదేశాలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
పోలీసులు నగరంలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా, అక్కడ పేలుళ్లకు ఉపయోగించే పదార్థాలు బయటపడ్డాయి. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భాగ్యనగర వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇద్దరిని అరెస్ట్ చేశామంటే.. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అనే సందేహాలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులుగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పలువురు ఉగ్రవాదులను హతమార్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఐసిస్ మాడ్యుల్ కుట్రను భగ్నం చేయడం పోలీసుల చాకచక్యానికి నిదర్శనమని చెప్పాలి. ప్రజలు అలర్ట్గా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ కుట్రను తిప్పికొట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆంధ్ర ఇంటెలిజెన్స్ విభాగాలను అధికారులు అభినందిస్తున్నారు. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతా వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని హామీ ఇచ్చారు.