కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గత 12 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా వంటి అన్ని రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు..
“4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్కు రూ.4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. వైసీపీ హయాంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం, రాష్ట్ర ఖర్చు తగ్గించాం. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది” అని తెలిపారు. అమరావతి పేరుతో దోపిడీ స్కాములకు పరాకాష్టగా నిలిచిందని ఆరోపించారు. కేవలం 12 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని మండిపడ్డారు.
“కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే, రాష్ట్ర రెవెన్యూలో కేవలం 3.8 శాతం మాత్రమే వృద్ధి ఉంది. మా ఐదేళ్ల పాలనలో రూ. 3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ. 1,37,546 కోట్ల అప్పు చేశారు. మేము ఐదేళ్లలో చేసిన అప్పును చంద్రబాబు(Chandrababu) ఏడాదిలోనే చేసి చూపించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మోసాలతో నింపేశారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదని.. అదంతా బాబు అనుకూల గజదొంగల జేబుల్లోకి వెళ్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధే కనపడటం లేదని జగన్ ఫైర్ అయ్యారు.