బీఆర్ఎస్ పార్టీలో కాక రేపుతోన్న కవిత(Kavitha) లేఖ వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎట్టకేలకు స్పందించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా అంతర్గత విషయాలు అంతర్గతంగ మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఉత్తరాలు రాయడం ఏదో గొప్ప విషయం ఏమి కాదన్నారు. అన్ని పార్టీల్లో సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని.. అలాగే తమ పార్టీలోనూ కోవర్టులు ఉండవచ్చు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులంతా బయటపడతారన్నారు.
తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి మాటల సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. ఈడీ ఛార్జ్షీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు, కేంద్రమంత్రులు పదవుల నుంచి తప్పుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే అంటూ ఆరోపణలు చేశారు.