పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఎత్తిపోతల ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ గోదావరి బోర్డుతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8న జరిగిన పీపీఏలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపినా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ సిద్ధమైందని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని దీనివల్ల గోదావరి డెల్టా వ్యవస్థ ప్రయోజనాలకు కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకూ నీటి లభ్యత లేదంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని తెలిపారు. డెడ్ స్టోరేజీ నుంచి ఎత్తిపోతల చేపట్టడకుండా సీడబ్ల్యూసీ వెంటనే ఏపీని అడ్డుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులకు కూడా ఇది విరుద్ధంగా ఉందని చెప్పారు.