విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ రిటైర్మెంట్తో భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ మార్పుల మధ్య, భారత జట్టు వచ్చే నెల ఇంగ్లండ్ పర్యటన ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించనుంది. జూన్ 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్ జరగనుండగా, శనివారం బీసీసీఐ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఇందులో శుభ్మాన్ గిల్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించగా, రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్ గా నియమించారు. యువ ఆటగాళ్లతో కూడిన ఈ కొత్త తరం జట్టు టెస్టు క్రికెట్లో భారత పునాది నిలబెట్టే ప్రయత్నం చేయనుంది.
బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో జరిగిన సెలెక్షన్ సమావేశంలో ఈ జట్టును ఎంపిక చేశారు. ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, కార్యదర్శి దేవ్జిత్ సైకియా నేతృత్వంలో జట్టు ఖరారైంది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జట్టును ప్రకటించారు.
ఈసారి జట్టులో కొన్ని ఆశ్చర్యకర మార్పులు చోటుచేసుకున్నాయి. మహ్మద్ షమీ ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమవ్వగా, చాలాకాలం తర్వాత కరుణ్ నాయర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లకు మరో అవకాశమిచ్చారు.
ఇంగ్లండ్ టూర్కు భారత టెస్ట్ జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
1వ టెస్ట్ – జూన్ 20-24, 2025: హెడింగ్లీ, లీడ్స్, 2వ టెస్ట్ – జూలై 2-6, 2025: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్, 3వ టెస్ట్ – జూలై 10-14, 2025: లార్డ్స్, లండన్, 4వ టెస్ట్ – జూలై 23-27, 2025: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్, 5వ టెస్ట్ – జూలై 31-ఆగస్టు 4, 2025: ది ఓవల్, లండన్.
ఇండియన్ టెస్ట్ క్రికెట్లో ఇది కొత్త అధ్యాయం. రోహిత్-విరాట్ శకానికి వీడ్కోలు పలుకుతూ యువ కెప్టెన్ గిల్ నేతృత్వంలో నూతన దారిలో ముందుకు సాగేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది.