ఐపీఎల్ 2025 సీజన్కు అద్భుత ముగింపు పలికింది సన్రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్స్ ఆశలు దూరమయినా.. తమ చివరి లీగ్ మ్యాచ్ లో చెలరేగి ఆడి ఫ్యాన్స్ కు మాంచి కిక్కు నిచ్చింది. KKRతో జరిగిన పోరులో 278 పరుగులు సాధించిన ఆ జట్టు.. 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన SRH.. కేకేఆర్ బౌలర్లను ధారుణంగా చీల్చి చెండాడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేయగా, క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కాటేరమ్మ కొడుకులా బీభత్సంగా ఆడిన అతను 39 బంతుల్లోనే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన క్లాసెన్ ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 9 సిక్సులు, 7 ఫోర్లు నమోదయ్యాయి.
ఈ పవర్ప్యాక్ ఆటతో హైదరాబాద్ స్కోరు బోర్డు 278 పరుగుల దాకా ఎగబాకింది. అభిమానులు మాత్రం 300 స్కోరు ఖాయమని భావించారు. అయితే చివరి ఓవర్లో కేవలం 17 పరుగులే రావడంతో, సన్రైజర్స్ తన సొంతమైన 287/3 రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. మణీశ్ పాండే(37), హర్షిత్ రానా(34), నరైన్(31) మినహా ఎవ్వరూ నిలువలేదు. సన్రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఉనద్కట్, ఎషాన్ మలింగా, హర్ష్ దూబే తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. చివరికి కేకేఆర్ 168 పరుగులకే కుప్పకూలింది.
ఈ భారీ విజయంతో హైదరాబాద్ సీజన్కి గుడ్ బై చెప్పింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్కి ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచింది. గతంలో 2018లో ముంబైతో 102 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్కి ఈసారి 110 పరుగుల తేడాతో ఓడింది. మరోవైపు హైదరాబాద్కు ఇది రెండో అత్యధిక విజయం. 2019లో ఆర్సీబీపై 118 పరుగుల తేడాతో గెలిచిన SRH.. ఇప్పుడు కేకేఆర్ను చిత్తుచేసింది. సీజన్ చివర్లో అయినా అభిమానుల మనసు దోచిన విధంగా ఆడిన హైదరాబాద్ జట్టు, వచ్చే ఏడాది కోసం ఆశలు పెంచింది.