వైఎస్సార్ జిల్లా పేరు మార్చడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. టీడీపీ నిర్వహించనున్న మహానాడులో వైఎస్సార్ పేరు పలకాల్సి వస్తుందని ఒకరోజు ముందుగా జిల్లా పేరుని మార్చేశారని ఆమె మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“మహానాడు ముచ్చటలో YSR పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం YSR కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మహానేత మరణానంతరం కడప జిల్లాకు YSR కడపగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.
కూటమి ప్రభుత్వానికి YSR పేరుమీద కక్ష్యపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే, పేర్లు మార్పు వెనుక మీకు దురుద్దేశ్యం లేకుంటే, సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి NTR జిల్లాగా కాకుండా, NTR విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. YSR జిల్లా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు NTR జిల్లాను NTR విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని అడుగుతున్నాం. YSR, NTR ఇద్దరు తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్న బిడ్డలే. ప్రజల గుండెల్లో ఇద్దరిది సమాన స్థానమే. ఒకరికి ఒకలా, మరొకరి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.