తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పసుపు పండగ మహానాడు(TDP Mahanadu 2025) ఈసారి కడప జిల్లాలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. భారీ మెజార్టీతో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు భారీగా చేరుకున్నారు. వైసీపీ కంచుకోట, మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ఉన్న కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నూలు-కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రింగురోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి మూడ్రోజుల పాటు మహానాడు జరగనుంది. మొదటి రెండు రోజులూ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ ఉంటుంది. మహానాడు సందర్భంగా కడప జిల్లా అంతా ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. ఈ మహానాడు ప్రాంగంణంలో ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్తానం.. సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే ముందు జాగ్రత్తల్లో భాగంగా అన్ని వసతులతో వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 15 పడకలతో పెట్టిన మెడికల్ క్యాంప్లో ఐసీయూ సహా అత్యవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికిపైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మూడోరోజు బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా వంటకాలను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
తొలి రోజు కార్యక్రమాలు ఇవే..
♦ ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు
♦ 10 నుంచి 10.45 గంటల వరకు ఫొటో ప్రదర్శన, రక్తనదాన శిబిరం ప్రారంభం
♦ 10.45 గంటలకు ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వనలతో ప్రారంభిస్తారు. అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం తెలుపుతారు. ఆ తరువాత పార్టీ కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు.
♦ 11.30 నుంచి 11.45 గంటల వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడి ప్రసంగాలు.
♦ 11.45 నుంచి 11.50 గంటల వరకు జమా ఖర్చుల నివేదిక.
♦ 11.50 గంటల నుంచి 12.45 గంటల వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగం.
♦ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ.
♦ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్.
♦ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య ‘కార్యకర్తే అధినేత’ అంశంపై చర్చ.
♦ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు యువగళం పేరిట యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ప్రజాపాలనలో సాంకేతికత, వాట్సప్ గవర్నెన్స్ అంశాలపై చర్చ.
♦ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పనలపై చర్చ ఉంటుంది.