సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తొమ్మిది మందిని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయల నగదు పురస్కారంతో సత్కరించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు.
“వారి కలం… వారి గళం… స్వరాష్ట్ర ఉద్యమ భాస్వరం. వారి ఆట… వారి పాట… పోరాటాలకు రాచబాట. అటువంటి తొమ్మిది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూ. కోటి నగదు పురస్కారంతో రాష్ట్ర ప్రజల తరపున గౌరవించుకున్నాం.
తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన శ్రీ ఎక్కా యాదగిరి రావు, శ్రీ అందెశ్రీ, శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ జయరాజు, శ్రీ పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందించాను. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరపున వారి కుటుంబ సభ్యులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న శ్రీ గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.” అని రేవంత్ పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ,11 మంది కి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం అందించారు. బహుభాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.