Friday, June 6, 2025
Homeఓపన్ పేజ్సంచకారి

సంచకారి

తెలంగాణ సాంస్కృతిక పాలసీ కావాలి!

- Advertisement -

సబ్బండ వర్గాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 11 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ 11 ఏండ్లలో టిఆర్‌ఎస్‌/బిఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నది. తొమ్మిదేండ్లు నిండినప్పుడే పాత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ‘ఘనంగా’ నిర్వహించింది. వారి పాలనతో ప్రస్తుత పాలనను బేరీజు వేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పటి తప్పులను చేయకుండా, అన్ని రకాల అవరోధాలను అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరమున్నది. లోపాలు సరిదిద్దుకొని మిగిలి ఉన్న కాలంలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుకు కృషి చెయ్యాలి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా సాంస్కృతిక రంగంలో కాంగ్రెసు పార్టీ గొప్పగా చెప్పుకునే పనేమీ చేయలేదు. లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జూన్ రెండున (నిన్న) పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేసినా అందులో తెలంగాణా సాంస్కృతిక పాలసీ గురించి మాట్లాడింది సున్నా. కోటి రూపాయల అవార్డులిచ్చిన సందర్భములో సాంస్కృతిక పాలసీ గురించి ప్రజలకు చెబితే బాగుండేది. నిజానికి తెలంగాణ తల్లి రూపం మార్పు, గీతం మార్పు ప్రజల్లోకి సానుకూలంగా వెళ్లలేదు. అసలు ముఖ్యమంత్రే ‘జై తెలంగాణ’ అనడం లేదనే విమర్శలున్నాయి.

ప్రభుత్వం చేసే ప్రజాహిత, పాపులర్‌ కార్యక్రమాలను దివిటీ పట్టి చూపించేది సాంస్కృతిక రంగం. జాతి గౌరవాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేది సంస్కృతి. ఈ రంగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. కనీసం చేసిన మంచిని కూడా చెప్పుకోలేకుండా ఉన్నది. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో తెలంగాణ కల్చర్‌ని బలంగా ‘షోకేస్‌’ చేయడానికి అవకాశం ఉండింది. కోట్లు ఖర్చు పెట్టి పోటీలు నిర్వహించినందుకు పేరేమో గానీ లండన్ దాకా బద్నామ్ మాత్రం అయ్యిండ్రు. ఇవన్నింటినీ పకడ్బందీగా నిర్వహించడానికి సరైన మెకానిజం ప్రభుత్వం దగ్గర లేక కాదు. అందుకు తగ్గ శ్రద్ధ లేదు. నిమగ్నమై పనిజేసే అధికారులను అర్ధాంతరంగా బాధ్యతల నుంచి తప్పించిండ్రు. ఇదంతా సంయమనం లేకపోవడం వల్ల జరిగిన నష్టం. ఇకముందు ఇట్లాగా అభాసు పాలుగాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వానికి ఒక నిర్దుష్టమైన సాంస్కృతిక పాలసీ ఉండాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, భాష పట్ల తగినంత పట్టింపు కావాలి. రాష్ట్రావతరణ సందర్బంగా ఈ విషయాన్ని పునర్ముల్యాంకనం చేసుకోవాలి.

2023లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో ‘‘సినిమా రంగంలో తెలంగాణా ప్రాంత ప్రయోజనాలు తెలంగాణ పల్లె జీవితాలు, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే సినిమాలతో పాటు ఇతర సామాజిక అంశాలను ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అలాగే తెలంగాణ ప్రాంత సినిమా, ప్రొడ్యూసర్లు, సినిమా రంగంలో ఆసక్తి కలిగిన వారికి రుణాలు, స్టూడియోల నిర్మాణం కోసం తగిన స్థలాలు కేటాయించేందుకు రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియ జేస్తున్నం.

తెలుగు ఉర్దూ భాషలను పెంపొందించేందుకై తెలుగు మరియు ఉర్దూ అకాడమీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేస్తం. తెలంగాణ మాండలికాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటం’’ అని ప్రకటించారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో తెలంగాణ సాహిత్య అకాడెమీకి, తెలుగు అకాడెమీకి, తెలంగాణ అధికార భాష సంఘానికీ ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. మీదు మిక్కిలి గద్దర్‌ పేరిట సినిమా రంగానికి అవార్డులివ్వడం ఇటు ఇండస్ట్రీలోనూ, అటు తెలంగాణ కళా సమాజంలోనూ ఆమోదం లేదు. గద్దర్‌ పేరుని చిరస్థాయిలో నిలుపదలుచుకుంటే తమ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ‘తెలంగాణ ఫిల్మ్‌ ఇన్సిట్యూట్‌’ని యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసి దానికి ‘గద్దర్‌’ పేరు పెట్టవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ప్రతియేటా కోటి రూపాయలకు తక్కువ గాకుండా అవార్డు లివ్వొచ్చు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్‌ పెరుగుతుంది.

అట్లా గాకుండా ‘హింసను ప్రోత్సహించే, సమాజంలో విభేదాలు సృష్టించే, అశ్లీలాన్ని ఆశ్రయించే’ సినిమాలకు గద్దర్‌ పేరిట అవార్డులివ్వడమంటే గద్దర్‌ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే! అంతేగాదు జ్యూరిలో ఆంధ్రా నిర్ణేతల హవా కొనసాగుతున్నది. అందుకే అవార్డులు తెలంగాణ బిడ్డలకు గాకుండా అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, నందమూరి కుటుంబాలకు దక్కినాయి. కట్టుదిట్టమైన విధివిధానాలు లేకుండా అవార్డులు ఆంధ్రాధిపత్య కమిటీ తమకు తోచిన విధంగా ఇవ్వడం అసంబద్ధం. ఈ నిర్ణేతల్లో అవార్డుకు పోటీబడ్డ సినిమా ఆర్టిస్టులు, టెక్నిషియన్లుండడంతో మొత్తం ఎంపిక ప్రక్రియనే హాస్యాస్పదంగా మారింది. ఇది బాధ్యతారాహిత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దలు విజ్ఞతతో మెలగాల్సిన అవసరమున్నది. ఇలాంటి భావ దారిద్య్రత ముందు ముందు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి.

తెలుగు భాష, విద్యా విషయాల్లో పరిశోధన, సర్వేతో పాటు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి తదితర అంశాల్లో ప్రామాణికమైన పుస్తకాలు ప్రచురించాల్సిన తెలుగు అకాడెమీకి పునర్విభజన సమస్యలు తొలగిపోయి ఇప్పుడు స్వతంత్రమయింది. అయితే ఈ సంస్థకు రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేక పోవడంతో పై పనులు నత్తనడకన నడుస్తున్నాయి. కొత్త పుస్తకాలకు, మాండలికాల సర్వేలకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఫ్రాడ్‌ సాకుతో అకాడెమీ ఫండ్స్‌ అన్నింటినీ హక్కు భుక్తం చేసుకున్న ప్రభుత్వం దాని నిర్వహణను పట్టించుకోవడం లేదు.

తెలంగాణ భాషను ‘మాండలికం’ అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడమే తప్పు. ఆంధ్ర భాష లాగా, తెలంగాణ ప్రాంత భాష కూడా భిన్నమైనది. మాండలికం అనడం ద్వారా మనని మనం తక్కువ చేసుకోవడమే. ఈ తెలంగాణ భాషను ప్రోత్సహించేందుకు కాంగ్రెసు ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒక క్రమానుగత పద్ధతిలో సిలబస్‌ను పునః లిఖించాల్సిన అవసరమున్నది. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకునే భాషనే పాఠశాలలోనూ బోధించినట్లయితే విద్యార్థి విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇట్లా తెలంగాణ తెలుగులో పాఠ్యపుస్తకాలు కొత్తగా తయారు చేయాల్సింది పోయి ‘కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుకను ఊడగొట్టే విధంగా’ ఇంటర్మీడియట్‌లో ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతం సబ్జెక్టుని బోధించే కుట్రకు ఇంటర్‌బోర్డు తెరలేపింది. భాషావేత్తలు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలుపడంతో ఇంటర్మీడియట్‌ బోర్డు వెనక్కి తగ్గింది. అయినా సంస్కృత కత్తి వేలాడుతూనే ఉన్నది. ప్రభుత్వం ఆమోదం లేకుండా ఈ దుశ్చర్యకు పాల్పడే ధైర్యం అధికారులకు ఉండదు.

ఒకవైపు తెలంగాణ ‘మాండలికం’ను ప్రోత్సహిస్తామంటూ మరోవైపు తెలుగు భాష గొంతు పిసికే విధంగా ఇంటర్‌లో సంస్కృతం బోధించాలని చూడడం దుర్మార్గం. ఇప్పటికే డిగ్రీలో తెలుగు సబ్జెక్టుకు క్రెడిట్స్‌ తగ్గించి అది బోధించే అధ్యాపకుల ఉద్యోగాలకు ఎసరు తీసుకొస్తున్నారు. తెలుగును ప్రోత్సహించే పద్ధతి ఇది కాదని ప్రభుత్వం గుర్తించాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు, వివిధ స్థాయిల్లో తెలుగు భాష అమలు ఎలా సాగుతుందో అధ్యయనం చేసి సూచనలిచ్చేందుకు ‘అధికార భాష సంఘాని’కి భాష విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి తెలంగాణ భాషావేత్తను అధ్యక్షుడిగా నియమించాలి. ఇది రాజకీయ పోస్టు కాదు కాబట్టి ఎలాంటి రికమండేషన్లకు తావు లేకుండా విద్యావేత్తను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి. గతంలో పాకాల యశోదారెడ్డి లాంటి విదుషీమణి ఈ సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ స్థాయి వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలి. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల భాష అధమ స్థాయికి దిగజారింది. ఇట్లాంటి క్లిష్ట సందర్భంలో తెలంగాణ తెలుగు భాషకు పట్టం కట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. తెలంగాణ భాష గౌరవాన్ని ఇనుమడింప జేయాలి.

గత ఏడాదిన్నరగా ‘తెలంగాణ సాహిత్య అకాడెమీ’ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉన్నది. ఇది కూడా రాజకీయేతర పోస్టు. ఇట్లాంటి వాటిని నింపడానికి తాత్సారం చేసినట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గతంలో తెలంగాణ సాహిత్య అకాడెమీ ద్వారా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించారు. పోషకులుగా ప్రచారం పొందారు. తెలంగాణ అస్తిత్వ సోయిని ఇనుమడింప చేయడంలో సభలు కీలక భూమిక పోషించాయి. ‘మనమూ చరిత్రకెక్కదగ్గ వారమే’ అని నిరూపించిన సందర్భమది. తెలంగాణ చరిత్రను ప్రామాణిక ఆధారాలతో సమగ్రంగా సంపుటాలుగా వెలువరించాల్సిన అవసరమున్నది. ఈ పనిని నిర్వహించేందుకు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన, ప్రాచుర్యం కల్పించేందుకు కూడా అకాడెమీ కృషి చేయాల్సి ఉంటుంది. సాహిత్య అకాడెమీ, అధికార భాషా సంఘాలకు అధ్యక్షులతో పాటు సభ్యులను కూడా నియమించి వారికి విధి విధానాలు నిర్ణయించాలి. నిధులు కేటాయించి పనులు జరిగేలా చూడాలి. గత ప్రభుత్వం అకాడెమీకీ సభ్యులను నియమించకుండా గుత్తాధిపత్యానికి తావిచ్చింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక, సాహిత్య రంగాల్లో సాధించిన ప్రగతికి నిదర్శనాలు ‘చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం’, ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’. ఈ రెండు విశ్వవిద్యాలయాల పేర్ల మార్పు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. షెడ్యూల్‌-10 ఆంక్షలు జూన్‌ 2, 2024తో ముగియడంతో తెలుగు విశ్వవిద్యాలయం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. ఇప్పుడీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం ముదావహం. అయితే ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించక పోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఖ్యాతి రాకుండా పోయింది. మే 28న సురవరం ప్రతాపరెడ్డి, నందమూరి తారకరామారావుల జయంతి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నందమూరికి నివాళి అర్పించి సురవరంని మరిచిపోయారు. ఇది కావాలని చేసి ఉండక పోవొచ్చు. అయితే అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. అది వారి బాధ్యత కూడా. అంతకుముందు మే 22 నాడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించినప్పటికీ రవీంద్రభారతిలో ప్రభుత్వం నుంచి రాజకీయ ప్రతినిధి ఎవ్వరూ హాజరు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయినప్పటి నుంచి ఇట్లా జరగడం ఇదే మొదటిసారి. ఒకవైపు ఆంధ్రుల విగ్రహాలు తొలగించాలని తెలంగాణా వాదులు డిమాండ్ చేస్తూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హైదరాబాద్ లో రోశయ్య, ఎన్టీ రామారావు విగ్రహాల స్థాపనకు ఉవ్విళూరుతున్నది. ఇది సమంజసం కాదు.

ఇదిలా ఉండగా గత ప్రభుత్వం సెక్రెటేరియట్‌ ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్థూప నిర్మాణాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు నిర్వహించుకోవడానికి బోలెడంత స్పేస్‌ ఉన్నది. అయితే అది కెసిఆర్‌ హయాంలో నిర్మితమయినందున దాన్ని వినియోగించినట్లయితే ఆ క్రెడిట్‌ ఆయనకు పోతుందనే భ్రమలో ప్రభుత్వమేమయినా ఉన్నదా అనే అనుమానం వస్తున్నది. అట్లంటే సెక్రెటేరియట్‌, కమాండ్‌ కంట్రోల్‌ కూడా కెసిఆర్‌ హయాంలో కట్టినవే కదా! ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషజాలకు పోకుండా తెలంగాణ అమరవీరుల స్థూప మందిరాన్ని ప్రజలందరి సందర్శనార్థం తెరిచి ఉంచాలి. అందులో 1969 ఉద్యమంలోనూ, మలి దశ పోరాటంలోనూ ప్రాణాలర్పించిన త్యాగధనుల చిత్రాల (సేకరించి) శాశ్వత ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కట్టడాలను పాలకుల ఇష్టాఇష్టాల మేరకు తెరిచి/మూసి ఉంచడమనేది రాచరిక పోకడలకు నిదర్శనం. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ విషయాన్ని చేతల్లో నిరూపించుకోవాల్సిన సందర్భమిది.

రచయిత

డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News