యావత్ ప్రపంచం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్(IPL Final) మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తుది సమరం జరగనుంది. పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా టోర్నీలో కొత్త విజేతగా నిలవనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు కప్ కొట్టలేదు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీ జట్టుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈసారి కప్ బెంగళూరుదేనని ఓ వీడియో అభిమానులతో పంచుకున్నారు. “ఈసారి కప్ మనదే! గత 18 సంవత్సరాలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రతి ప్రార్థన, ప్రతి ఉత్సాహం, ప్రతి హార్ట్ బ్రేక్ ఇవన్నీ ఈ రోజు కోసమే. ఇది మన రోజు. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్సీబీ. కర్ణాటక ప్రజలంతా మీతోనే ఉన్నారు” అని డీకే తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.