ఐపీఎల్ 18వ సీజన్ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ కప్పును గెలుచుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీ అభిమానులు ఎదురుచూస్తున్న గెలుపు చివరకు వారి కళ్లారా చూడగలిగారు. టీమ్ను ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీ కల కూడా చివరకు నెరవేరింది. 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, కోహ్లీ కెరీర్లో ఇదొక గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
అయితే ఐపీఎల్ ముగిసిన ఈ తరుణంలో కోహ్లీ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఒక్క విషయంపై పడింది. అదే కోహ్లీని మళ్లీ ఎప్పుడు మైదానంలో చూస్తామని. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్టులకు కూడా గుడ్బై చెప్పాడు. ప్రస్తుతం ఆయన కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్లో కోహ్లీ కనబడే అవకాశమే లేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన ఆటను ఆస్వాదించే వీలూ లేకుండా పోయింది.
దీంతో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగేది ఆగస్టులోనే. ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్తో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకా వేదికగా ఆగస్టు 17న తొలి వన్డే, రెండో వన్డే ఆగస్టు 20న, మూడో వన్డే ఆగస్టు 23న జరగనున్నాయి. కానీ ఆ దేశంలో అశాంతి కారణంగా భారత జట్టు అక్కడ పర్యటించకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ బంగ్లాదేశ్తో సిరీస్ రద్దు అయితే మాత్రం కోహ్లీని చూసేందుకు అక్టోబర్ వరకు ఆగాల్సిందే. భారత జట్టు అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా అక్టోబర్ 19న, అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న రెండో వన్డే, సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న మూడో వన్డే జరగనుంది.