ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్ ద్వారా శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశం లభిచింది. జూన్ 20న లాడ్స్ వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యువ కెప్టెన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎలా ఆడబోతుందోనని, ముఖ్యంగా అతడి బ్యాటింగ్ నైపుణ్యం, నాయకత్వం ఎలా ప్రభావం చూపుతాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గిల్ కెప్టెన్సీలో జట్టు బ్యాలెన్స్, ఆటగాళ్ల పొటెన్షియల్ను ఎలా వినియోగిస్తాడన్నది కీలకం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు, ఇంగ్లాండ్కు బయలుదేరే ముందు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూతన కెప్టెన్సీ అంటే ఎవరి స్టైల్ను అనుకరించడం కాదు. జట్టును ముందుండి నడిపించడమే తన విధానమని స్పష్టం చేశాడు.
శుభ్మన్ గిల్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 37వ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞుల్ని పక్కన పెట్టి.. యువకుడైన గిల్కు ఈ బాధ్యత ఇవ్వడం పెద్ద విషయమే. ఇప్పటి వరకు 32 టెస్ట్ మ్యాచ్ల అనుభవం ఉన్న గిల్, గతంలో జింబాబ్వేతో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది.
ఆటలో నైపుణ్యంతో పాటు, నిశ్చలమైన మనస్తత్వం, ఆటగాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ ఇవన్నీ కలిసివచ్చినప్పుడు గిల్ నాయకత్వం ఫలించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ద్వారా అతడు నిజంగా నాయకుడిగా నిలదొక్కుకుంటాడా.. టీమ్ఇండియా కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా.. అనే ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాశం ఉందని అంటున్నారు. మరి గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.