ప్రపంచంలోనే అతి ఎతైన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని(Chenab Bridge)ప్రధాని మోదీ(PM Modi)ప్రారంభించారు. అనంతరం ఈ రైల్వే బ్రిడ్జిని జాతికి అకితం చేశారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ని కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్ రైలులో మోదీ ప్రయాణించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో జమ్మూకశ్మీర్ భారత రైల్వేస్ తో అనుసంధానం అయింది. దీని ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి నినాదం సార్థకం అయింది.
చినాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..
☛ చినాబ్ బ్రిడ్జిని నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
☛ పారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటుంది.
☛ ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2.86 కోట్ల కిలోల స్టీల్ను వాడారు.
☛ మైనస్ 10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.
☛ భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు.
☛ ఈ బ్రిడ్జి మొత్తం 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
☛ ఈ వంతెన నిర్మాణానికి రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది.
☛ దీని జీవితకాలం దాదాపు 120 ఏళ్లు
☛ గరిష్ఠంగా 100కి.మీ. వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది.
☛ దీని నిర్మాణంతో జమ్మూకశ్మీర్ భారత రైల్వే నెట్వర్క్తో అనుసంధానం
☛ ఈ వంతెనతో నెరవేరిన వందల ఏళ్ల నాటి ప్రజల కల

