కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram Project) అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అవాస్తవాలు చెబుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao)తెలిపారు. తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ కూలినట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. అంచనా వ్యయం పెరగకుండా పూర్తి చేసిన ప్రాజెక్ట్ దేశంలో ఒక్కటి కూడా లేదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం రూ.102 కోట్లతో ప్రారంభిస్తే.. వ్యయం రూ.1,183 కోట్లు చేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాగా.. రూ.94 వేల కోట్లకు పెరిగిందన్నారు.
కాళేశ్వరం అంటే.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం అని హరీశ్ రావు చెప్పారు. మొత్తం కాళేశ్వరంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లు ఉన్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్, సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్, అన్నారం బ్యారేజీలో 64 పియర్స్ ఉన్నాయని వెల్లడించారు.
మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పిలర్లుగా నిర్మించారని తెలిపారు. తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని, అక్కడ నీళ్తు తక్కువ ఉంటాయనే ప్రాజెక్ట్ను మేడిగడ్డకు మార్చామని అన్నారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోందని.. ఒక్క కాళేశ్వరంతో వేలాది చెరువులు నింపొచ్చని తెలిపారు. యాసంగిలో ఈ నీటితోనే పంటలు పండాయన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు అన్నీ వాడకంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
కాళేశ్వరం కింద కాలువల ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 20.33 లక్షల ఎకరాలకు నీరందించామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జిల్లాల్లో 940 టీఎంసీలు కేటాయించారని.. కానీ తెలంగాణ ఆ జలాలను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోదని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని.. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు మొదలు పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన జలయజ్ఞాన్ని.. ధనయజ్ఞం అంటూ ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు.
2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా చెప్పారని.. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించక ముందే 2011 నాటికి అంచనా వ్యయం రూ.40 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదంటూ మహారాష్ట్ర సర్కార్ చెప్పిందని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామని తెలిపారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే.. తమకు అభ్యతరం ఏం లేదని నాటి మహారాష్ట్ర చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు అభ్యతరం చెప్పకుండా మహారాష్ట్రతో చర్చలు జరిపామని అన్నారు. ఇక మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టొద్దంటూ ఏ ఇంజినీర్ చెప్పలేదని హరీశ్ రావు వివరించారు.