ప్రతి ఏటా వినాయకచవితి వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganesh)ఉత్సవాలు గురించి మాట్లాడుకోవాల్సిందే. అత్యంత ఎత్తైన, విశిష్టమైన గణపతి ప్రతి ఏటా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఆ మహా గణపతి దివ్యదర్శనం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు.
అయితే ఆ మహా గణపతిని ప్రతిష్టించేందుకు కనీసం 3 నెలల ముందే ఉత్సవ కమిటీ నిర్వాహకులు పనులు మొదలుపెడతారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వినాయకుడి విగ్రహం తయారీ కోసం కర్ర పూజ ముహుర్తం ఖరారు చేశారు. జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా కొలువుదీరనున్నాడు. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం విగ్రహ నమూనా చిత్రాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సంవత్సరం విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తున రూపుదిద్దుకోనున్నాడు.
ఈ నమూనా చిత్రంలో విగ్రహం మూడు తలలతో, నిల్చున్న భంగిమలో దర్శనమిస్తుంది. తలపై పడగవిప్పిన ఐదు సర్పాలు, మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, రుద్రాక్షమాల, అభయహస్తం చూపుతూ.. ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉంటాయి. విగ్రహం దిగువన కుడివైపు పూరీ జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీ లలితా త్రిపురసుందరి విగ్రహాలు రూపుదిద్దుకోనున్నాయి. అలాగే.. వినాయకుడి మండపానికి కుడివైపున ఉన్న మండపంలో దాదాపు 25 అడుగుల ఎత్తులో శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువుదీరుతారు.
కాగా ఖైరతాబాద్లో మహా గణపతిని 1954వ సంవత్సరలో తొలిసారిగా ప్రతిష్ఠించారు. గతేడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఏకంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఇక ప్రతి ఏడాది ఒక్క అడుగు మేర తగ్గించుకుంటూ విగ్రహాన్ని ప్రతిష్టాస్తామని నిర్వాహకులు చెప్పిన సంగతి తెలిసిందే.