నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణీ ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఈ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి బత్తిని అమరనాథ్ చేప ప్రసాదం నోట్లో వేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, కర్ణాటక ఎమ్మెల్సీ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
వార్షిక కార్యక్రమంలో భాగంగా, బతిని గౌడ్ కుటుంబం లక్షలాది మంది రోగులకు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి మూలికలతో తయారు చేసిన చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. దూద్బౌలిలోని బతిని పూర్వీకుల ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబసభ్యులు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధుల సమస్యల నుంచి ఈ చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నగరానికి తరలివస్తారు. చేప ప్రసాదం పంపిణీ వేదిక వద్ద బారికేడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, అగ్నిమాపక శాఖ సేవలతో సహా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
చేప ప్రసాదం పంపిణీ కోసం తెలంగాణ మత్స్య శాఖ 1.5 లక్షలకు పైగా చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రత్యక్ష ముర్రెల్ చేపల (ఫింగర్లింగ్స్) పంపిణీ కోసం 35 కౌంటర్లు తెరవబడ్డాయి. ఇక TGSRTC సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు, JBS, MGBSతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
కాగా వైద్యుల ద్వారా, సైన్స్ ద్వారా నిరూపించలేకపోయినా బత్తిని పూర్వీకులకు ఓ రుషి అందించిన ఫార్ములా ప్రకారం వంశపారం పర్యంగా ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఈ మందు ఆస్తమా రోగాన్ని నయం చేస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ మందు పంపిణీని 1845లో ప్రారంభించారు. అప్పటి నుంచి 177 సంవత్సరాలుగా బత్తిని సోదరుల వారసులు ఈ కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు.