జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఎక్కువగా తెల్ల డ్రెస్సులోనే కనపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీషర్ట్, షార్ట్ ధరించి విజయవాడలో సందడి చేశారు. కానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన “కొనికి” అనే సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తమ అభిమాన హీరో, నాయకుడు పవన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంనటే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు .సెలూన్ కొనికి ప్రారంభోత్సవం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అభిమానులకు హాయ్ చెప్పారు. కారు ఎక్కుతున్న సమయంలో అభిమానులకు హాయ్ చెప్పి నమస్కరించారు. కొందరితో ఫొటోలు దిగారు.
అయితే ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ లేత నీలం రంగు రౌండ్ నెక్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్స్ ధరించి వచ్చారు. ఆయన క్యాజువల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ట్రెండీ లుక్ ఆకట్టుకుందని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఓవైపు రాజకీయంగా బిజీగా ఉంటూనే.. సమయం కుదిరినప్పుడు షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటంగ్ కంప్లీట్ చేశారు. అలాగే ‘ఓజీ’లోనూ తన పాత్రకు సంబంధించిన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. ఓజీ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుండగా.. హరిహర మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.



