జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపినాథ్(Maganti Gopinath) ఇవాళ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాగంటి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్(KTR), హరీశ్ రావు, ఇతర ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
ఇక మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపినాథ్ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబసభ్యులకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇవాళే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించడంతో మాగంటి అంతిమయాత్ర ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. మాగంటి గోపినాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆయన పాడె మోశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించడంతో పాటు ఏఐజీ ఆస్పత్రిలో మాగంటి చికిత్సకు అయిన మొత్తం ఖర్చుని ప్రభుత్వమే భరించనున్నట్లు ప్రకటించారు. జూన్ 5న గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స అందించినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు కన్నుమూశారు.