సాధారణంగా స్టాక్ మార్కెట్ అంటేనే చాలామందికి భయం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నష్టాలు వస్తాయోనన్న ఆందోళన. కానీ, కొన్నిసార్లు దీర్ఘకాలిక పెట్టుబడులు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. అలాంటి అద్భుతమే ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆయన తండ్రి లక్ష రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా రూ. 80 కోట్లు లాభం తెచ్చిపెట్టింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నమ్మశక్యం కాని ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
విషయం ఏంటంటే…
సౌరవ్ తన దివంగత తండ్రి నుంచి JSW స్టీల్ షేర్లను వారసత్వంగా పొందారు. లక్ష రూపాయల పెట్టుబడితో 1990లలో కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పాత పేపర్లు ఆయన ఇంటి బీరువాలో అనుకోకుండా దొరికాయి. వాటిని చూసిన సౌరవ్, వాటి ప్రస్తుత విలువ తెలుసుకొని షాకయ్యారు. అప్పట్లో లక్ష రూపాయలకు కొన్న ఈ షేర్ల విలువ ప్రస్తుతం లక్ష నుంచి ఏకంగా రూ. 80 కోట్లకు చేరింది.
ఈ అనుకోని సంఘటనతో సౌరవ్ను ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలిపారు. “మా నాన్న డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోవడం వల్లే ఈ అదృష్టం దక్కింది” అని సౌరవ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఎందుకంటే, ఒకవేవేళ డీమ్యాట్ అకౌంట్ ఉండి ఉంటే, అవి ఎప్పుడో అమ్మేసే అవకాశాలు ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.
దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రయోజనాలు..
ఈ సంఘటన ఈక్విటీ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల (Long-term investments) ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. సరైన సమయంలో సరైన కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన దీర్ఘకాలంలో ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందో దీని ద్వారా స్పష్టమవుతోంది. “కొనండి, మర్చిపోండి” అనే సిద్ధాంతానికి ఇది చక్కటి ఉదాహరణగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల స్పందన….
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది దీర్ఘకాలిక పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తున్నారు. “బలమైన వ్యాపారాలలో వాటాలను విక్రయించడానికి తొందరపడటం కంటే, పెట్టుబడిదారులు సమయానికి రాబడిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వాలి” అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. “ఇది కేవలం పెట్టుబడి గురించి మాత్రమే కాదు.. ఇది ఆర్థిక వారసత్వాలను నిర్మించడం గురించి కూడా” అని ఇంకొకరు పేర్కొన్నారు. మరో నెటిజన్, “నాణ్యమైన స్టాక్లను కొనుగోలు చేయడం, రోజువారీ లావాదేవీలు విస్మరించడం అద్భుతాలు చేస్తుందని” కామెంట్ చేశారు. స్టాక్ స్ప్లిట్లు (Stock splits), బోనస్ ఇష్యూలు (Bonus issues), డివిడెండ్ చెల్లింపులు (Dividend payments) వంటి కార్పొరేట్ చర్యలు సంపద సృష్టికి గణనీయంగా దోహదపడతాయని ఇంకొకరు గుర్తుచేశారు.
మొత్తంమీద, సౌరవ్ దత్తా కథ పెట్టుబడి ప్రపంచంలో ఓ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అదృష్టం, దీర్ఘకాలిక దూరదృష్టి కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తోంది.