Ganja seized: నేటి యువత గంజాయి మత్తుకు బానిస అవుతున్నారు. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగం చేసే వ్యక్తుల వరకు గంజాయి బానిసలుగా మారుతున్నారు. దీంతో హైదరాబాద్ లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా స్మగ్లర్లు పట్టించుకోవడం లేదు. తమ రూట్ మార్చుకుని మరి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏకంగా చాక్లెట్ ప్యాకెట్స్ లో గంజాయి కలిపి పాఠశాలలు, కాలేజీ పరిసరాల్లో విక్రయిస్తున్నారు. దీంతో చదువుకునే వయసులోనే యువత మత్తుకు వ్యసనపరులుగా మారుతున్నారు.
తాజాగా నగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో లోకేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కేజీన్నర ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే బంజారాహిల్స్ లోని నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12 సయ్యద్ నగర్కు చెందిన సయ్యద్ ఇబ్రహీం అనే యువకుడు ఫాల్ సీలింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం రాత్రి మేయర్ నివాసం సమీపంలోని ఖాళీ స్థలంలో మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇబ్రహీంను పట్టుకున్నారు. అతడిని సోదా చేయగా ఐదు గ్రాముల గంజాయి లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Ganja: హైదరాబాద్ లో గంజాయి కలకలం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES