Israel Iran Conflict : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్, “ఇరాన్ క్షిపణులను ప్రయోగించడం ఇలాగే కొనసాగిస్తే టెహ్రాన్ తగలబడిపోతుంది” అని తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సమావేశమైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సొంత పౌరులనే బందీలుగా…
ఇరాన్ తీరుపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఇరాన్ నియంత ఖమేనీ తమ సొంత పౌరులనే బందీలుగా మారుస్తున్నాడు” అని ఆయన ఆరోపించారు. టెహ్రాన్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ఖమేనీ సృష్టిస్తున్నారని కాట్జ్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పౌరులపై ఖమేనీ నేరపూరిత దాడులకు పాల్పడుతున్నారని మంత్రి కాట్జ్ ధ్వజమెత్తారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడులను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. “ఒకవేళ ఖమేనీ ఇజ్రాయెల్పై ఇలానే క్షిపణుల దాడులను కొనసాగిస్తే, టెహ్రాన్ తగలబడుతుంది” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్ :
ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయగా, ఇరాన్ సైన్యాధిపతి సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ “టెహ్రాన్ తగలబడుతుంది” అని తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో ఇరాన్ వైమానిక స్థావరాలు, మిస్సైల్ లాంచర్లే లక్ష్యంగా చేసుకోగా, డజన్ల కొద్దీ పౌరులు మరణించారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాజీ, ఆపరేషన్స్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బనీ కూడా ఈ దాడుల్లో మరణించినట్లు ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. అయితే, వీరు ఎక్కడ మరణించారనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.
దేశ రక్షణ కోసం పౌరులు ఐక్యమవ్వాలి :
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్ధాలుగా శత్రుత్వం ఉంది. కానీ ఇన్నాళ్లు పరోక్ష సంఘర్షణలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మొదటిసారి ప్రత్యక్షంగా ఇంత తీవ్రంగా దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. శుక్రవారం చేసిన మొదటి దాడిలో 78 మంది మరణించగా, 320 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి తెలిపారు. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు దేశ రక్షణ కోసం పౌరులు ఐక్యంగా ఉండాలని ఇరాన్ పిలుపునిచ్చింది.
టెల్ అవీవ్లో భారీ విధ్వంసం :
ఇరాన్ క్షిపణి దాడుల వల్ల టెల్ అవీవ్ సమీపంలోని రామత్ గాన్ నగరంలో భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, 19 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ భద్రతా దళాలు తెలిపాయి.
కాల్పులు తక్షణమే ఆపండి :
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, కాల్పులు తక్షణమే ఆపాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.
ఉద్రిక్తతలను తగ్గించే దిశగా :
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ను క్షిపణి దాడుల నుండి రక్షించడానికి తాము సహాయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి “దౌత్యం, చర్చలు” అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్తో ఫోన్లో చర్చించారు.