WEATHER REPORT: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న చిరు జల్లులు ఇప్పుడు భారీ వర్షాలుగా మారనున్నాయి.
తెలంగాణాలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో యెల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు :
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ముందస్తు జాగ్రత్తలు:
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు వాతావరణ సూచనలు పాటిస్తూ, అనవసర ప్రయాణాలు మానుకోవాలని, విద్యుత్ అంతరాయాలకు సిద్ధంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరింది. సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆరోగ్య శాఖ సూచించింది.