Encroachment of Land in Rangareddy District : రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో సుమారు రూ.10,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) ఉమ్మడిగా దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.
రంగారెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణపై హైకోర్టులో పిటిషన్: వేల కోట్ల విలువైన భూమి ప్రైవేటుపరంపై విచారణ
శేరిలింగంపల్లి మండలం, ఖాజాగూడలోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్, నిర్మాణాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో PIL దాఖలు చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా బదలాయించి, దానిపై భారీ నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్లు ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు: పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనల ప్రకారం, రెవెన్యూ అధికారులు 1996లో 27.18 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా సిఖందర్ ఖాన్, సలాబత్ ఖాన్లకు రిజిస్టర్ చేశారు. ఖాస్రా పహాణీ, సేత్వార్లలో ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, సర్వే నంబర్లలోని లోపాలను సరిదిద్దే నెపంతో కొత్త సర్వే నంబర్ ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద అడంగల్ పహాణీలో నమోదు చేశారని ఆయన ఆరోపించారు.
భారీ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు: ప్రస్తుతం సర్వే నంబర్ 27లో ఉన్న ఆ భూమి బెవెర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, సోహినీ బిల్డర్స్ అధీనంలో ఉందని, అక్కడ 48 అంతస్తుల 8 భారీ టవర్ల నిర్మాణం జరుగుతోందని చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనూ, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్కు 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంటు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు: ఈ అక్రమ నిర్మాణాలపై మార్చిలో హైడ్రాకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పిటిషనర్లు తెలిపారు. 2023 జనవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ NOC జారీ చేయగా, దాని ఆధారంగా 2023 మార్చి, 2024 అక్టోబర్లో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేశారని, దానిని తిరిగి స్వాధీనం చేసుకునేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని చిక్కుడు ప్రభాకర్ కోర్టును కోరారు.
న్యాయస్థానం స్పందన: పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కీలక మలుపు కానుంది.