Bus Accident in Himachal Pradesh: ఇటీవల దేశంలో వరుస ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే.. ఉత్తరాఖండ్ లో హెలికాఫ్టర్ క్రాష్.. పుణేలో ఇంద్రాయణి నది వంతెన కుప్పకూలడం.. ఇలా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. దీంతో దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన ప్రజలు వెంటాడుతుంది. ఇదిలా ఉండగానే తాజాగా హిమాచల్ ప్రదేశ్లో బస్సు ప్రమాదం సంభవించింది.
మండీ జిల్లాలోని సర్కాఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జహు నుంచి మండి వెళ్తుండగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పట్రీఘాట్ గ్రామ సమీపంలోని లోయలో జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయని.. ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30-40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. కాగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జారుడుగా ఉన్నాయని.. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.