Netherlands vs Nepal T20: టీ20 క్రికెట్ మ్యాచులు అంటేనే ఉత్కంఠకు పేరు పెట్టినవి. ప్రతి పరుగు, ప్రతి వికెట్, ప్రతి క్యాచ్ ఏకంగా మ్యాచ్ ఫలితాన్నే క్షణాల్లో తారుమారు చేస్తుంటాయి. అందుకే మ్యాచ్ ప్రారంభమైన దగ్గరి నుంచి అన్ని జట్లు ఏ చిన్న తప్పిదం జరగకుండా చాలా జాగ్రత్తగా ఆడతాయి. ఒక్కోసారి చేసే చిన్న తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి చివరి బంతికి ఫలితం వస్తే.. అరుదుగా మ్యాచుల టై అవుతాయి. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్క సూపర్ ఓవర్ జరగడమే అరుదు అయితే.. ఓ మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు జరిగి క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది.
ట్రై సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. బాస్ డి లీడే (35), విక్రమ్జిత్ సింగ్ (30) పరుగులతో రాణించారు. 153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ జట్టు అద్భుతంగా పోరాడింది. కెప్టెన్ రోహిత్ 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నేపాల్ విజయానికి చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన తరుణంగా ఆ జట్టు ఆటగాడు నందన్ యాదవ్ ఫోర్ కొట్టాడు. దీంతో స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది.
ఈ సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19/1 పరుగులు చేసింది. 20 పరుగులు చేయాల్సిన నెదర్లాండ్స్ జట్టు కూడా 19 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్ లో మొదట నెదర్లాండ్స్ 17/2 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ కూడా 17 పరుగులు చేయడంతో మూడో సూపర్ ఓవర్ జరిగింది. అయితే మూడో సూపర్ ఓవర్ లో నేపాల్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. పరుగులు ఏం చేయకుండా మూడు వికెట్లు కోల్పోయారు. దాంతో కేవలం ఒక్క పరుగు టార్గెట్ తో బరిలో దిగిన డచ్ టీమ్ ప్లేయర్ మైఖేల్ తొలి బంతికే సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు. మొత్తానికి మూడు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించి శభాష్ అనిపించింది. ఈ మ్యాచ్ అభిమానులకు సూపర్ థ్రిల్ అందించింది.