Wednesday, June 18, 2025
Homeఆంధ్రప్రదేశ్RK Roja: సీఎం చంద్రబాబుపై ఆర్కే రోజా విమర్శలు

RK Roja: సీఎం చంద్రబాబుపై ఆర్కే రోజా విమర్శలు

RK Roja Serious on CM Chandrababu: కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ మహిళలను చెట్టుకు కట్టేసి దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గరి నుంచి తెలుగుదేశం క్యాడర్ రెచ్చిపోతున్నారని.. ప్రజలు, మహిళలపై దాడుల చేస్తున్నారని ఆరోపించారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలపై లైంగిక దాడులు, హత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రెడ్ బుక్ పాలన కాకుండా ప్రజాస్వామ్యంగా పాలన చేయాలని సూచించారు. పాలన గాలికొదిలేసి వైసీపీ నేతలు, సాక్షి యాజమాన్యంపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని రోజా విమర్శించారు.

కాగా కుప్పం మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప.. మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పులు బాధ భరించలేక తిమరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయాడు. దీంతో భార్య శిరీషను చెట్టుకు తాడుతో కట్టేసి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను విడిపించారు. స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహిళలను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News