Iran Threatens Close Strait Hormuz : ఇజ్రాయెల్ భీకర దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష సైనిక ప్రతిఘటన కంటే వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తన సైనిక శక్తితో నేరుగా ఇజ్రాయెల్ను ఎదుర్కోవడం కష్టమని గుర్తించి, పరోక్ష మార్గాల్లో ప్రతీకారం తీర్చుకునే పద్ధతులను అన్వేషిస్తోంది. ఓ పక్క భారీ క్షిపణులతో దాడులు చేస్తూనే, మరో పక్క దౌత్యపరంగా ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఐరోపా దేశాలను ఆశ్రయించి, ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని కోరారు.
హార్మూజ్ జలసంధి మూసేస్తామని హెచ్చరిస్తున్న ఇరాన్ : అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. అరేబియా సముద్రంలో 21 మైళ్ల వెడల్పు ఉన్న ఈ మార్గం ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం, మరియు ఒకటి/మూడు వంతు LNG రవాణా జరుగుతుంది. నిత్యం 2 కోట్ల పీపాల చమురు ఇక్కడి నుంచే పలు దేశాలకు చేరవేస్తున్నారు. ఇరాన్ ఈ బెదిరింపులకు దిగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత్పై ప్రభావం: హార్మూజ్ జలసంధిలో ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ప్రభావం చూపుతుంది. భారత్ చమురు అవసరాల్లో 40% ఈ మార్గం నుంచే వస్తుంది, కాబట్టి మూసివేత వల్ల రవాణా, బీమా ఖర్చులు పెరిగి దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే తమ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది, ఎందుకంటే చైనా దాని చమురులో 80% కొనుగోలు చేస్తుంది. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలోనూ జలసంధి తెరిచే ఉన్నా, ట్యాంకర్లపై మాత్రం దాడులు జరిగాయి.
ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం : ఇరాన్ గతంలో మాదిరిగానే ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ దాడుల కారణంగా హమాస్, హెజ్బొల్లా వంటి ఇరాన్ మద్దతు సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత ఘర్షణల్లో ఇరాకీ మిలిటెంట్లు కలుగజేసుకోలేదు, కేవలం హౌతీ రెబల్స్ మాత్రమే ఇజ్రాయెల్పై దాడులకు దిగారు.