Vishnu Manchu – Manchu Mohan babu: విష్ణు టైటిల్ పాత్రలో సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్ అయ్యిందో కానీ.. సినిమా ట్రోలింగ్ రావటం, వివాదాలు చుట్టుముట్టటం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే బ్రాహ్మణ చైతన్య వేదికా సంఘం కన్నప్ప సినిమాలోని పాత్రలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొనసాగుతోన్న ఈ వివాదం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని పాత్రలు, పేర్లు ఉన్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో, సినిమా విడుదలను తక్షణమే నిలిపివేయాలని, అదే సమయంలో అభ్యంతరకర అంశాలపై విచారణ జరిపించాలని కోరారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది.
ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి, సినిమా విడుదలైన తర్వాత అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే , వాటిని తొలగించేందుకు ఆదేశాలిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. ఇకపై ఈ అంశంలో స్పందన అందించాల్సిందిగా హైకోర్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్సీ సీఈఓ, సీబీఎఫ్సీ ప్రాంతీయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నటులు మోహన్బాబు, విష్ణు, బ్రహ్మానందం, సప్తగిరిలకు నోటీసులు జారీ చేసింది.
ALSO READ: https://teluguprabha.net/news/ram-charan-peddi-movie-ott-rights/
కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో భాగంగా విడుదలైన ‘పిలక’, ‘గిలక’ అనే పాత్రల పోస్టర్లపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రల్లో బ్రహ్మానందం, సప్తగిరి నటించారు. పిలక, గిలక పేర్లు తమ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ, తగిన స్పందన లేకపోతే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని కొన్ని రోజుల ముందే హెచ్చరించాయి. గుంటూరులో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్కు ముందే ఈ పాత్రలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ అప్పుడే చిత్ర యూనిట్ ఏమీ స్పందించకపోవటంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. తాజాగా హైకోర్టు జోక్యంతో సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కన్నప్ప మూవీలో విష్ణు కథానాయకుడిగా నటిస్తుంటే రుద్ర అనే పాత్రలో ప్రభాస్, పరమేశ్వరుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. ఇంకా మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా దీన్ని వంద కోట్లకు పై బడ్జెట్తో నిర్మించారు. న్యూజిలాండ్లో సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం జరిగింది.