India Launched Operation Sindhu : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్న వేళ, ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ సమన్వయంతో చేపట్టిన ఈ చర్యకు ‘ఆపరేషన్ సింధు’ అని పేరు పెట్టారు.
110 మంది విద్యార్థులకు సురక్షిత రవాణా
ఇజ్రాయెల్ టెహ్రాన్పై మిసైల్ దాడులు కొనసాగిస్తున్న వేళ, ఉత్తర ఇరాన్లో చిక్కుకుపోయిన 110 మంది భారత విద్యార్థులు జూన్ 17న ఆర్మేనియాకు చేరుకున్నారు. వీరిని అక్కడి రాజధాని యెరవాన్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా భారత్కు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 19 తెల్లవారుజామున వారు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. “విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. వారి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.
టెహ్రాన్లో తీవ్ర ఉద్రిక్తత – భారత ఎంబసీ హెచ్చరిక : ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. పరిస్థితి అత్యంత తీవ్రమవుతుండటంతో, అక్కడి భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు వెంటనే టెహ్రాన్ను విడిచి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇప్పటికీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించని వారు, తక్షణమే సంప్రదించాలని భారత ఎంబసీ విజ్ఞప్తి చేసింది.
ఢిల్లీలో తెలంగాణ భవన్ హెల్ప్లైన్ – రాష్ట్ర ప్రభుత్వం స్పందన
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పౌరులకు అవసరమైన సాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టింది. తెలంగాణ భవన్, ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. యుద్ధం కారణంగా ఇప్పటివరకు తెలంగాణ వాసులకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేకపోయినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఈ హెల్ప్లైన్ సిద్ధం చేశారు. ప్రయాణాల్లో లేదా స్థానిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులు, అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని Telangana Bhavan Resident Commissioner కార్యాలయం తెలిపింది.
వందన- రెసిడెంట్ కమిషనర్ పీఎస్- +91 9871999044
జి.రక్షిత్నాయక్, లైజన్ ఆఫీసర్- +91 9643723157
జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్- +91 9910014749
సీహెచ్ చక్రవర్తి, పౌరసంబంధాల అధికారి- +91 9949351270