Thursday, June 19, 2025
Homeనేషనల్Good news for FASTag users : రూ.3వేలకే ఏడాది ఫాస్టాగ్ పాస్

Good news for FASTag users : రూ.3వేలకే ఏడాది ఫాస్టాగ్ పాస్

FASTAG ANNUAL PASS FOR PRIVATE VEHICLES : హైవేలపై తరచూ ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై కేవలం రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకుంటే, దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిరాటంకంగా, టోల్ చెల్లింపుల లేకుండా ప్రయాణించవచ్చు. రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పాస్‌ను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి జారీ చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల రిజిస్ట్రేషన్, యాక్టివేషన్ కోసం త్వరలోనే ‘రాజ్‌మార్గ్ యాత్రా’ యాప్‌, ఎన్‌హెచ్ఏఐ (NHAI), ఎంఆర్‌టీహెచ్ (MoRTH) వెబ్‌సైట్లలో ప్రత్యేక లింకులు అందుబాటులోకి రానున్నాయి.

200 వాహన ట్రిప్పులు – ఏడాది వ్యవధి : ఫాస్టాగ్ వార్షిక పాస్‌ అనేది యాక్టివేట్ చేసుకున్న తేదీ నుంచి ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ వ్యవధిలో దేశంలోని అన్ని జాతీయ రహదారులపై గరిష్ఠంగా 200 వాహన ట్రిప్పులు ప్రయాణించొచ్చు. 200 వాహన ట్రిప్పులు, ఏడాది వ్యవధి.. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటితో ఫాస్టాగ్ వార్షిక పాస్‌ చెల్లుబాటు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ రూ.3వేల ఫీజును చెల్లించి, దాన్ని రెన్యూవల్ చేయించుకోవాలి.

ఏ వాహనాలకు వర్తించనుంది? : ఈ పాస్ నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వ్యక్తిగత ప్రయాణాల కోసం వినియోగించే వాహనాలు ఇందులోకి వస్తాయి.

- Advertisement -

టోల్ క్యూలు తగ్గే అవకాశం : ప్రస్తుతం దేశ హైవేలపై సగటున ప్రతి 60 కిలోమీటర్లకూ ఒక టోల్ ప్లాజా ఉంది. ప్రతీసారి ఆగి చెల్లింపులు జరిపే తంతుతో చాలా సమయ వృథా జరుగుతోంది. ఫాస్టాగ్ వార్షిక పాస్‌తో ఈ నిరవధిక ఆగింపులకు ముగింపు పలుకుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య 60% వాహనాలు ప్రైవేటు వాహనాలే కావడంతో, వీటి కోసం ప్రత్యేక పాస్ జారీ చేస్తే టోల్ క్యూలు తగ్గుతాయని ప్రభుత్వం విశ్లేషిస్తోంది.

నెలవారీ పాస్‌తో పోలిస్తే రూ.1,080 ఆదా : ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెలవారీ పాస్ ధర రూ.340. అంటే సంవత్సరానికి రూ.4,080 ఖర్చవుతోంది. దీని స్థానంలో కొత్త వార్షిక పాస్ తీసుకుంటే కేవలం రూ.3,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వాహనదారులు రూ.1,080 వరకు ఆదా చేసుకోవచ్చు. పైగా ఏడాదంతా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.

ప్రభుత్వం లక్ష్యం – వేగవంతమైన, క్లిష్టతలేని హైవే ప్రయాణం : 2023–24 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వచ్చినా, ప్రైవేటు కార్ల వాటా కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే. ప్రయాణాల పరంగా వీటి వాడకం అధికమైనప్పటికీ, ఆదాయం తక్కువగా ఉండటంతో ఇవి గందరగోళానికి కారణమవుతున్నాయి. అందుకే వేర్వేరు చార్జింగ్ మోడళ్లను రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News