ND-ENG Test Series: శుక్రవారం నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక పటౌడీ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జూన్ 20న లీడ్స్ వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభాన్ని అందుకోవాలని భావిస్తున్నాయి. రెండు జట్లకు 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సీజన్ కూడా ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. భారత జట్టుకు యువ ఆటగాడు శుభమన్ గిల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో ఈ సిరీస్ టీమిండియాకు కఠిన సవాలుగా మారనుంది.
రోహిత్, కోహ్లీ స్థానాల్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఇప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ స్పష్టతకు రాలేదు. బ్యాటింగ్ కూర్పుపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్, ఐదో స్థానంలో తాను బ్యాటింగ్కు వస్తానని రిషభ్ పంత్ ప్రకటించాడు. కానీ ఓపెనింగ్ ఎవరు చేస్తారు.. ఫస్ట్ డౌన్లో ఏ ఆటగాటు బరిలో దిగుతాడనే దానిపై క్లారిటీ లేదు. ఓవైపు టీమిండియా తుది జట్టు ఎంపికపై తీవ్రంగా ఆలోచిస్తుంటే.. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మాత్రం తొలి టెస్టును 11 మంది ఆటగాళ్లను కూడా ప్రకటించేసింది.
గాయంతో జట్టుకు దూరమైన క్రిస్ వోక్స్ జట్టులో చేరాడు. దీంతో ఇంగ్లీష్ పేస్ బౌలింగ్ మరింత పటిష్టంగా మారనుంది. ఇక ఆల్రౌండర్ బాకబ్ బెతెల్కు స్థానం దక్కలేదు. జాక్ క్రాలే, బెన్ డకెట్ ఇన్నింగ్స్ను ఆరంభించనుండగా ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు దిగనున్నారు.
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.