Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ప్రాణాలు తీసే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు..? షర్మిల తీవ్ర ఆగ్రహం

YS Sharmila: ప్రాణాలు తీసే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు..? షర్మిల తీవ్ర ఆగ్రహం

YS Sharmila Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనపై ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శించడం ఏంటని మండిపడ్డారు. అసలు బెట్టింగ్‌లకు బానిసై ఆత్మహత్య చేసుకున్న వారికి విగ్రహాలు కట్టడం ఏంటని నిలదీశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయకుండా బలప్రదర్శనలకు దిగడం సమంజసం కాదని సూచించారు. జగన్ పల్నాడు పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు.

- Advertisement -

వీరి మరణాలకు కారణమెవరని.. వారి కుటుంబాలకు ఎవరు తోడుంటారని ఆమె ప్రశ్నించారు. బలప్రదర్శనతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇద్దరు చావుకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 మందికి అనుమతి ఇస్తే వేల మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. పోలీసు శాఖ చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించిందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కి మాత్రమే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ధ్వజమెత్తారు. బలప్రదర్శన చేసే జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు విధించడం లేదని.. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి అన్నారు. బీజేపీకి జగన్ దత్తపుత్రుడు కాబట్టి ఆంక్షలు పెట్టడం లేదా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ చేస్తారని.. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని వాపోయారు. కానీ జగన్ చేసే పరామర్శలకు మాత్రం దగ్గరుండి మరి అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ ఈ బలప్రదర్శను ఏంటని జగన్‌ను దుయ్యబట్టారు షర్మిల. ప్రభుత్వం హామీల అమలు మీద ప్రశ్నించకుండా బలప్రదర్శనలతో ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారన్నారు.

కాగా జగన్ పల్నాడు పర్యటనలో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆంక్షలను సైతం వైసీపీ నేతలు లెక్క చేయకుండా వేలాది వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై వాగ్వాదానికి బారికేడ్లను పక్కకు తోసేశారు. ఇక కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులుపైనా తీవ్ర చర్చ జరగుతోంది. మొత్తానికి జగన్ పర్యటనలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News