Friday, June 20, 2025
HomeతెలంగాణKonda Murali: సొంత నేతలపై రెచ్చిపోయిన మంత్రి కొండా సురేఖ భర్త

Konda Murali: సొంత నేతలపై రెచ్చిపోయిన మంత్రి కొండా సురేఖ భర్త

Konda Murali Hot Comments: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ దంపతులది ప్రత్యేక శైలి. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా రాజకీయాలు నడిపారు. వైఎస్ మంత్రివర్గంలో కొండా సురేఖ మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ మరణానంతరం జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ కుమారుడు జగన్ వెంటన నడిచారు. జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జగన్‌ వైఖరి నచ్చక ఆమె తిరిగి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇక ఆమె భర్త కొండా మురళి ఫైర్ బ్రాండ్‌గా పేరు దక్కించుకున్నారు.

- Advertisement -

అయితే తాజాగా కొండా మురళి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన కొండా మురళి మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయారు. సీనియర్ నాయకులపై పరోక్షంగా విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందని గుర్తుచేశారు. తాను కూడా పదవికి రాజీనామా చేసి పార్టీ మారానని తెలిపారు. తమ లాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

టీడీపీ నుంచి వచ్చిన ఓ నాయకుడు అప్పుడు చంద్రబాబుని, మొన్న కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు. ఇలాంటి నాయకుడితో సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లిపై కూడా విమర్శలు గుప్పించారు. బీసీ నేతను అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తాను ఉన్నంత వరకు మరో నాయకుడు ఎవరూ ఉండరని వార్నింగ్ ఇచ్చారు. తన భార్య కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని కొందరు నాయకుల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదని తమ వెనక సీఎం రేవంత రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారని తేల్చిచెప్పారు. మొత్తానికి కొండ మురళి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News