Sonia Gandhi Discharge: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉండంటతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఆమె పొత్తి కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడ్డారని.. అందుక తగ్గ చికిత్స అందించామన్నారు. ఆమె ఆరోగ్యంపై నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కుమారుడు పుట్టినరోజు నాడే సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం గాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
కాగా జూన్ 15వ తేదీ రాత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదర సంబంధ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అందుకు తగ్గట్లు గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు జరిపి చికిత్స అందించారు. జూన్ నెల తొలి వారంలో ఆమె రక్తపోటు కారణంగా సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. వయసురీత్యా ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమె తరుచుగా అనారోగ్యానికి గురవుతూ చికిత్స పొందుతున్నారు. సోనియా ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
అనారోగ్యం కారణంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండారు. తన స్థానమైన రాయబరేలీ నుంచి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం పార్టీ కీలక సమావేశాలకు మాత్రమే హాజరువుతున్నారు. ఇక రాజ్యసభకు ఎన్నికైన ఆమె అప్పుడప్పుడు పెద్దల సభకు హాజరువుతున్నారు. కాగా సోనియా దశాబ్దం పాటు యూపీఏ చైర్ పర్సన్గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.