Friday, June 20, 2025
Homeఇంటర్నేషనల్Israel's Warning : తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరిక

Israel’s Warning : తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరిక

Ultimatum from Israel to Iranian People : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) ఇరాన్ ప్రజలను హెచ్చరించింది. టెహ్రాన్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని తక్షణం ఖాళీ చేయాలని IDF సూచించింది. ఈ హెచ్చరికను ఉపగ్రహ చిత్రంతో సహా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఈ రియాక్టర్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగపడటం వల్ల అణ్వాయుధ తయారీలో కీలకమైనదని ఇజ్రాయెల్ భావిస్తోంది.

రక్తసిక్తంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ: భారీ ప్రాణనష్టం
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 639 మంది మరణించగా, 1,329 మంది గాయపడ్డారని వాషింగ్టన్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ వెల్లడించారు. మృతుల్లో 263 మంది పౌరులు, 154 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. అయితే, ఇరాన్ అధికారిక గణాంకాల ప్రకారం 224 మంది మరణించగా, 1,277 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్యలు యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు: టెహ్రాన్‌పై బాంబుల వర్షం
గురువారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌లోని 20కి పైగా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో యురేనియం సెంట్రిఫ్యూజ్‌లు, అణ్వాయుధ పరిశోధన కేంద్రాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ చర్యలు ఇరాన్ అణు ఉత్పత్తిని అడ్డుకోవడానికే ఉద్దేశించబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

శాంతి సందేశంతో భారత్: భద్రతా మండలిలో అత్యవసర భేటీ
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా, చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం రెండో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వంగా ముందుకొచ్చారు. ఒకవైపు ఇజ్రాయెల్ భద్రతను కాపాడుతూ, మరోవైపు ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు గల అవకాశాలను చర్చించాల్సిన అవసరాన్ని పుతిన్ ప్రస్తావించారు.

ఇరాన్‌లో భారతీయుల భద్రతకు ప్రత్యేక చర్యలు :
భారత్‌లోని ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హుస్సేనీ మాట్లాడుతూ ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే ముందుగా ఇజ్రాయెల్ దాడులను ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇరాన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News