Friday, June 20, 2025
Homeఇంటర్నేషనల్War Fear Over Tehran: షెల్టర్లకు పోటెత్తిన ప్రజలు - ఫోన్, మెసేజ్ సేవలకు అంతరాయం

War Fear Over Tehran: షెల్టర్లకు పోటెత్తిన ప్రజలు – ఫోన్, మెసేజ్ సేవలకు అంతరాయం

Israel Iran War Effect : ఇజ్రాయెల్, అమెరికా చర్యలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం యుద్ధ భయంలో మునిగిపోయింది. నగరాన్ని విడిచి వెళ్లమని ప్రజలకు అల్టిమేటం జారీ చేయగా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి. డ్రోన్ దాడులు, బాంబుల భయంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోగా, ఫోన్ కాల్స్, మెసేజింగ్ సేవలు కూడా ఆగిపోవచ్చని ప్రజలు భయపడుతున్నారు.

వలసలే దిక్కుగా మారిన పరిస్థితి : ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్ గగనతలాన్ని చుట్టుముట్టిన వేళ, అక్కడి ప్రజలు జీవితాన్ని అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. గత మూడురోజుల్లోనే వేలాది మంది టెహ్రాన్‌ను విడిచి శివారు ప్రాంతాలు, కాస్పియన్ సముద్ర తీరాలు, అర్మేనియా, తుర్కియేలకి వలస వెళ్లారు. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. అయితే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని వెంటనే తరలించలేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

మెట్రో స్టేషన్లే తాత్కాలిక ఆశ్రయం : ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా మంది సొంత ఇంటిని వదిలి మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదుల్లో తలదాచుకుంటున్నారు. ఇరాన్ ప్రభుత్వం వీటిని తాత్కాలిక షెల్టర్ జోన్లుగా ప్రకటించడంతో జనంతో కిక్కిరిసి పోయాయి. ఒకవేళ ఇవే లక్ష్యంగా మారితే, పెను ప్రాణనష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షెల్టర్లు లేని భారీ భవనాలు 1980 కన్నా భయంకర స్థితి : ఇరాన్-ఇరాక్ యుద్ధ కాలంలో టెహ్రాన్‌లోని ప్రతి ఇంటిలో బేస్‌మెంట్‌లు ఉండేవి. కానీ ప్రస్తుతం నిర్మితమవుతున్న నూతన భవనాల్లో అలాంటి ఏర్పాట్లు లేవు. ఇది ఇప్పుడు ప్రజలకు తీవ్రమైన లోటుగా మారింది. అంతేకాదు, అప్పట్లో వినిపించే ఎయిర్ రైడ్ సైరన్లు, సురక్షిత ప్రాంతాల ప్రణాళికలు ఈసారి కనిపించట్లేదని నివాసితులు చెబుతున్నారు.

మీడియా సంస్థలు కవరేజ్ నిలిపివేశాయి : ఇజ్రాయెల్ దాడులకు భయపడి చాలా మీడియా సంస్థలు కవరేజ్ నిలిపివేశాయి. ఫలితంగా టెహ్రాన్‌లో ఏం జరుగుతుందో ప్రపంచానికి సమాచారం చేరడం కష్టమవుతోంది. ఇది ఓ డిజిటల్ మూగతనంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

టెలీ కమ్యూనికేన్ వ్యవస్థలో అంతరాయం : టెహ్రాన్‌లో ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కష్టంగా మారాయని, తమ కుటుంబంతో మాట్లాడే ప్రతిసారీ అది చివరి సంభాషణ అవుతుందేమోనని టెహ్రాన్‌ వాసి షిరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు బతికి ఉంటామో లేదో తెలియని పరిస్థితి ఉందని, చాలామంది నగరం వదిలి వెళ్లినా, ఇది పరిష్కారం కాదని ఆమె అన్నారు. కొందరు ఇరాన్ పాలకులను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను మాత్రం వ్యతిరేకిస్తున్నారని షిరీన్ తెలిపారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News