Bonalu festival Start June 26: భాగ్యనగరం బోనాల పండుగకు ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది ఆషాడమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కలు చెల్లించుకోవడం హైదరాబాద్లో ఆనవాయితీగా వస్తోంది. బోనాల పండుగ సంబురానికి ప్రభుత్వ యంత్రాంగం, ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తోంది. సిటీలోని ఆయా ప్రాంతాల్లో జరిగే బోనాల ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
ఈనెల 26న శ్రీ జగదాంబ ఆలయంలో తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభం కానుంది. సంస్కృతీ, సంప్రదాయ ఉట్టిపడేలా, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా బోనాల నిర్వహించాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం సూచించారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/harish-rao-serious-comments-on-cm-revanth-reddy
ఈనెల 26న ప్రారంభమైన బోనాల ఉత్సవాలు జులై 26 వరకు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈనెల 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించనున్నారు. వచ్చేనెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, ఆ మరుసటి రోజు జులై 14న రంగం భవిష్యవాణి.. 20న భాగ్యనగర లాల్ దర్వాజా బోనాల జాతర నిర్వహించనున్నారు. జులై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు.
జులై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని, రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పోలీసు, దేవదాయశాఖ అధికారులు కంట్రోల్ రూం నుంచి మానిటరింగ్ చేయనున్నారు. కార్యక్రమాలను వీక్షించేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం సూచించిన సంగతి తెలిసిందే.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ బస్టాండ్ నుంచి గోల్కొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండడంతో అధిక సంఖ్యలో తరలిరానున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, విద్యుత్, మెడికల్ క్యాంప్ ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. రష్ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
గత సంవత్సరం గుడి లోపల అభిషేకం జరుగుతుంటే భక్తులను ఆపడం వల్ల తోపులాట జరిగిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదని, భక్తులను లోపలకి అనుమతించాలని మంత్రి తెలిజేశారు. డీజే సౌండ్ లేకుండా నృత్యాలు చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని అధికారులను ఆదేశించారు.