Kadapa Municipal Corporation Meeting: కడప నగరపాలక సంస్థ సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కడన మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇటీవల అనర్హత వేటుకు గురైన మేయర్ సురేశ్ బాబు.. హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆయన మేయర్గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో హోదాలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి హాజరయ్యారు.
ఈ క్రమంలో మరోసారి కుర్చీ వివాదం చెలరేగింది. సమావేశం హాలులో మేయర్ సీటు పక్కనే కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డికి అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతో తనకు తెలియకుండా తన పక్కనే ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేయడంపై మేయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అయితే నిబంధనల ప్రకారం కౌన్సిల్ హాలులో సమావేశం ఏర్పాటు చేయకుండా మేయర్ ఛాంబర్లో ఎలా ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లతో కలిసి కౌన్సిల్ హాలులో వేచి ఉండగా.. మేయర్, వైసీపీ కార్పొరేటర్లు ఛాంబర్లోనే ఉన్నారు. మేయర్ తీరుపై మాధవీరెడ్డి ఫైర్ అవుతున్నారు. దీంతో కడప మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా గతంలో కూడా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదు. దీంతో ఆమె మేయర్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలాగే నిలబడిపోయారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది. అనంతరం మేయర్ కుటుంబం నిబంధలను విరుద్ధంగా కాంట్రాక్టుపనలు చేపట్టారని మేయర్ సురేశ్ బాబుపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఆధారంగా మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేశ్ బాబుపై అనర్హత వేటు వేశారు. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కుర్చీ పక్కనే ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయడంపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాధవీరెడ్డి మాత్రం ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో తమకు కుర్చీలు వేశారని చెబుతున్నారు. మొత్తానికి కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మరోసారి ఉత్కంఠకు దారి తీసింది.