Bonus is bogus for Thin rice: ఎన్నికల హామీల్లో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి రైతులను మభ్యపెట్టారని, ఇప్పుడేమో సన్నాలకి పరిమితం చేసి ఆ సన్నాలకు కూడా ఎగనామం పెట్టారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్పై ధ్వజమెత్తారు. శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా, యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని విమర్శించారు. సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయ్యిందని, సన్న వడ్ల బోనస్పై సన్నాయి నొక్కులేనా అని హరీశ్ మండిపడ్డారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయలేదన్నారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని హరీశ్ రావు ఫైరయ్యారు.
పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని, సన్ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందన్నారు.ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందోని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికిన వ్యవసాయ మంత్రి రెండు నెలలు దాటినా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయమన్నారు.
పెండింగ్లో ఉన్న 1,116 కోట్లరూపాయల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్ ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ, పాలనను కూడా అబద్ధాలతో నడిపిస్తున్నారని విమర్శించారు.
అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందని, రుణమాఫీ 50 శాతం రైతులకి కూడా అందలేదని, పోయిన వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. యాసంగిలో రైతు భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 15 వేల రైతు భరోసా అని చెప్పి మాట తప్పి 12,000 కి పరిమితం చేశారని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, రైతు కూలీల పరిస్థితి ఏంటని నిలదీశారు. పంట పెట్టుబడి సహాయం అందించడంలో, గిట్టుబాటు ధర కేటాయించడంలో, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోలు చేయడంలో, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో సీఎం రేవంత్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు.