IND vs ENG 1st Test: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత్కు మంచి శుభారంభం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు పరిగెత్తించారు. ఇద్దరు కలిసి నిలకడగా పరుగులు చేశారు. ఈ క్రమంలో 91 పరుగుల వద్ద రాహుల్ తొలి వికెట్గా ఔట్ అయ్యాడు. 42 పరుగుల వద్ద బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఫస్ట్ స్లిప్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ జోడీ తొలి వికెట్కు 151 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఐపీఎల్లో అదరగొట్టిన సుదర్శన్పై టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 92 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో అంపైర్లు లంబ్ బ్రేక్ ప్రకటించారు.
సుదర్శన్ ఔట్తో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభమన్ జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. కెప్టెన్గా తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న గిల్ సారథిగా జట్టును ముందుగా తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి ఆశలను గిల్ ఏమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రౌడన్ కార్స్ , బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీశారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులకు సంతాపం తెలియజేస్తూ ఇరు జట్ల ఆటగాళ్లు కొద్దిసేపు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు సంతాపంగా జెర్సీలపై నల్ల బ్యాడ్జ్ ధరించారు.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.