Spiritual Duty Over Diplomatic Dinner: ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి, ఒడిశాలోని జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడానికే ప్రాధాన్యతనిచ్చారు. భువనేశ్వర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ట్రంప్ నుంచి మోదీకి ఫోన్ కాల్, ఒడిశాలో బీజేపీ పాలన నవశకానికి నాంది : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కెనడాలో జరిగిన జీ7 సదస్సుకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేశారని వెల్లడించారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని ట్రంప్ సూచించినట్లు మోదీ తెలిపారు.
అదే సమయంలో, బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి విషయంలో నవశకం ప్రారంభమైందని మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలో సుపరిపాలన, ప్రజాసేవలో బీజేపీ సర్కార్ ఏడాది పూర్తి చేసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన మోదీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో కలిసి విందులో పాల్గొని, పలు విషయాలపై చర్చించుకుందామని ఆహ్వానించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే, తనకు పూరీలోని జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడమే అత్యంత ప్రాధాన్యమని ట్రంప్కు స్పష్టం చేసినట్లు మోదీ వెల్లడించారు.
“అభివృద్ధికి ఆమడ దూరంలో” – గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో సుపరిపాలనకు చోటు లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా, ఒడిశాలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని మోదీ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని, ఆ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయాయని మోదీ అన్నారు.
అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒడిశాను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మోదీ స్పష్టం చేశారు. వందల కోట్ల ప్రాజెక్టులను చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారు.
“రెడ్ కారిడార్”పై మోదీ విమర్శలు: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశంలోని 125కు పైగా గిరిజన ప్రాబల్య జిల్లాలు చాలా సంవత్సరాలుగా మావోయిస్టుల ప్రభావానికి గురయ్యాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతాలకు “రెడ్ కారిడార్” వంటి చెడ్డ పేరు వచ్చిందని, ఈ జిల్లాల్లో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయని మోదీ పేర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోలేదని మోదీ ఆరోపించారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేసి, వాటిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, “రెడ్ కారిడార్” అనే పేరును చెరిపివేసి అభివృద్ధి సంకేతాన్ని తీసుకువస్తుందని మోదీ తెలిపారు.
ఒడిశా నుంచి వైజాగ్కి… ఆపై దిల్లీకి మోదీ ప్రయాణం : బిహార్ పర్యటనను ముగించుకుని ఒడిశా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్కడ రూ. 18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఒడిశా పర్యటన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్కు బయల్దేరనున్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద శనివారం జరిగే యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి దిల్లీకి వెళ్లానున్నారు.